John 9:1-41 OTSA
[1] యేసు దారిలో వెళ్తూ పుట్టుకతో గ్రుడ్డివాడుగా ఉన్న ఒక వ్యక్తిని చూశారు. [2] ఆయన శిష్యులు ఆయనను, “రబ్బీ, అతడు గ్రుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు పాపం చేశారు? అతడా లేదా అతని తల్లిదండ్రులా?” అని అడిగారు. [3] యేసు, “అతడు కానీ అతని తల్లిదండ్రులు కాని పాపం చేయలేదు. దేవుని కార్యాలు అతనిలో వెల్లడి కావడానికి ఇలా జరిగింది. [4] పగలున్నంత వరకు నన్ను పంపినవాని పనులను మనం చేస్తూ ఉండాలి. రాత్రి వస్తుంది అప్పుడు ఎవరూ పని చేయలేరు. [5] ఈ లోకంలో ఉన్నంత వరకు నేను ఈ లోకానికి వెలుగు” అని చెప్పారు. [6] ఆయన ఇది చెప్పి నేల మీద ఉమ్మివేసి, ఆ ఉమ్మితో కొంత బురద చేసి, అతని కళ్ల మీద దానిని పూసారు. [7] ఆయన అతనితో, “వెళ్లు, సిలోయము అనే కోనేటిలో కడుక్కో” అని చెప్పారు. సిలోయము అనగా, “పంపబడిన” అని అర్థము. అతడు వెళ్లి కడుక్కుని చూపుతో ఇంటికి వచ్చాడు. [8] అతని పొరుగువారు, అంతకుముందు గ్రుడ్డిభిక్షవానిగా అతన్ని చూసినవారు, “వీడు ఇక్కడ కూర్చుని భిక్షం అడుక్కున్నవాడు కాడా?” అని చెప్పుకొన్నారు. [9] వారిలో కొందరు వాడే అన్నారు. మరికొందరు, “కాదు, వాడిలా ఉన్నాడు” అన్నారు. అయితే వాడు, “ఆ వానిని నేనే” అని ఒప్పుకున్నాడు. [10] వారు అతన్ని, “అయితే నీ కళ్లు ఎలా తెరుచుకున్నాయి?” అని అడిగారు. [11] అతడు వారితో, “యేసు అనే ఆయన కొంత బురద చేసి దాన్ని నా కళ్ల మీద పూసారు. తర్వాత సిలోయము కోనేటికి వెళ్లి కడుక్కో అని చెప్పాడు. కాబట్టి నేను వెళ్లి కడుక్కున్న తర్వాత చూడగలుగుతున్నాను” అని చెప్పాడు. [12] వారు, “ఆయన ఎక్కడ?” అని అతన్ని అడిగారు. వాడు, “నాకు తెలియదు” అని చెప్పాడు. [13] అంతకుముందు గ్రుడ్డివానిగా ఉండిన వానిని వారు పరిసయ్యుల దగ్గరకు తీసుకెళ్లారు. [14] అయితే యేసు బురద చేసి అతని కళ్లను తెరిచిన రోజు సబ్బాతు దినము. [15] అందుకు పరిసయ్యులు ఎలా చూపు పొందావని వానిని అడిగారు. అందుకు అతడు, “ఆయన నా కళ్ల మీద బురద పూసాడు. నేను దానిని కడుక్కున్న తర్వాత చూడగలుగుతున్నాను” అని చెప్పాడు. [16] పరిసయ్యులలో కొందరు, “ఇతడు సబ్బాతు దినాన్ని పాటించడంలేదు. కాబట్టి ఇతడు దేవుని నుండి రాలేదు” అన్నారు. కానీ మరికొందరు ఒక పాపి ఇలాంటి అద్భుత కార్యాలను ఎలా చేయగలుగుతాడు? అన్నారు. కాబట్టి వారిలో భేదాలు ఏర్పడ్డాయి. [17] చివరికి వారు గ్రుడ్డివానితో, “నీ కళ్లను తెరిచిన ఈ వ్యక్తి గురించి నీ అభిప్రాయం ఏమిటి?” అని అడిగారు. వాడు, “ఆయన ఒక ప్రవక్త” అన్నాడు. [18] అయినా వారు ఆ గ్రుడ్డివాడు చూపు పొందాడని నమ్మలేదు కాబట్టి వాని తల్లిదండ్రులను పిలిపించారు. [19] వారు తల్లిదండ్రులతో, “ఇతడు మీ కుమారుడేనా? పుట్టు గ్రుడ్డివాడని మీరు చెప్పే కుమారుడు వీడేనా? అయితే వీడు ఇప్పుడెలా చూడగలుగుతున్నాడు?” అని అడిగారు. [20] అందుకు వాని తల్లిదండ్రులు, “వీడు మా కొడుకే, వీడు గ్రుడ్డివానిగానే పుట్టాడని మాకు తెలుసు. [21] అయితే ఇప్పుడు వీడు ఎలా చూస్తున్నాడో, వీని కళ్లను ఎవరు తెరిచారో మాకు తెలియదు. వీడు పెద్దవాడే కాబట్టి వీనినే అడగండి. తన సంగతి తానే చెప్పుకోగలడు” అన్నారు. [22] యేసును క్రీస్తు అని అంగీకరించిన వారిని సమాజమందిరం నుండి బయటకు వెలివేయాలని యూదా అధికారులు ముందుగానే నిర్ణయించారు కాబట్టి అతని తల్లిదండ్రులు వారికి భయపడి అలా చెప్పారు. [23] అందుకే అతని తల్లిదండ్రులు, “అతడు పెద్దవాడు అతన్నే అడగండి” అన్నారు. [24] గ్రుడ్డివానిగా ఉండిన వానిని యూదా అధికారులు మరలా రెండవసారి పిలిపించారు. “నీవు సత్యం చెప్పి దేవుని మహిమపరచు. మాకైతే ఆ వ్యక్తి పాపి అని తెలుసు” అన్నారు. [25] అందుకు అతడు, “ఆయన పాపియో కాడో నాకు తెలియదు. కానీ నాకు తెలిసింది ఒక్కటే. గ్రుడ్డివాడిగా ఉన్న నేను ఇప్పుడు చూడగలుగుతున్నాను” అని చెప్పాడు. [26] అప్పుడు వారు వానిని, “ఆయన నీకేమి చేశాడు? నీ కళ్లను అతడు ఎలా తెరిచాడు?” అని అడిగారు. [27] వాడు వారితో, “నేను మీకు ముందే చెప్పాను కానీ మీరు వినలేదు. మీరు మరలా ఎందుకు వినాలని అనుకుంటున్నారా? మీరు కూడ ఆయన శిష్యులు కావాలనుకుంటున్నారా?” అని అడిగాడు. [28] అప్పుడు వారు అతన్ని దూషించి, “నీవే వాని శిష్యుడవు. మేము మోషే శిష్యులం! [29] దేవుడు మోషేతో మాట్లాడాడని మాకు తెలుసు, కానీ వీడు ఎక్కడి నుండి వచ్చాడో కూడ మాకు తెలియదు” అన్నారు. [30] అందుకు అతడు, “ఆయన ఎక్కడి నుండి వచ్చారో మీకు తెలియక పోవడం ఆశ్చర్యమే! అయినా ఆయన నా కళ్లను తెరిచారు. [31] దేవుడు పాపుల మనవి వినరని మనకు తెలుసు. తన చిత్తాన్ని చేసే భక్తుల మనవి ఆయన వింటారు. [32] భూమి మొదలైనప్పటి నుండి ఏ పుట్టు గ్రుడ్డివాని కళ్లు తెరవబడ్డాయని ఎవరు వినలేదు. [33] ఒకవేళ ఇతడు దేవుని నుండి కానట్లైతే, ఏమి చేయగలిగేవాడు కాదు” అని చెప్పాడు. [34] దానికి వారు, “పుట్టుకతోనే పాపిగా ఉన్న నీవు మాకు బోధిస్తున్నావా?” అని వానిని సమాజమందిరం నుండి బయటకు వెలివేశారు. [35] అతన్ని సమాజమందిరం నుండి బయటకు వెలివేశారని యేసు విని, అతన్ని కనుగొని, “నీవు మనుష్యకుమారుని నమ్ముతున్నావా?” అని అడిగారు. [36] అప్పుడు అతడు, “అయ్యా, ఆయన ఎవరు? నాతో చెబితే నేను ఆయనను నమ్ముతానేమో” అన్నాడు. [37] యేసు, “నీవు ఆయనను చూస్తున్నావు, నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను” అన్నారు. [38] అప్పుడు అతడు, “ప్రభువా, నేను నమ్ముతున్నాను” అని చెప్పి ఆయనను ఆరాధించాడు. [39] అప్పుడు యేసు, “నేను గ్రుడ్డివారు చూసేలా, చూసేవారు గ్రుడ్డివారయ్యేలా తీర్పు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాను” అన్నారు. [40] అక్కడ ఉన్న కొందరు పరిసయ్యులు ఆయన చెప్పిన ఈ మాటలు విని, “అయితే మేము కూడ గ్రుడ్డివారమేనా?” అని అడిగారు. [41] అందుకు యేసు, “మీరు గ్రుడ్డివారైతే మీమీద ఈ పాపం ఉండేది కాదు; కాని చూడగలమని మీరు చెప్పుకుంటున్నారు. కాబట్టి మీ పాపం నిలిచి ఉంటుంది” అని చెప్పారు.
